
సినిమా
‘‘నేను ఏ చిత్రం చేసినా సరే.. అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నానా? ప్రత్యేక గీతం చేస్తున్నానా? అన్నది అసలు పట్టించుకోను. ఓ నటిగా నా పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలుగుతున్నానా? దర్శకులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానా? లేదా? అన్నదే నాకు ముఖ్యం’’ అన్నారు నటి అనసూయ.
ఆమె ఓవైపు బుల్లితెర వ్యాఖ్యాతగా మెప్పిస్తూనే.. చక్కటి నటనా ప్రాధాన్యమున్న పాత్రలతో వెండితెరపైనా మెరుపులు మెరిపిస్తున్నారు. ఇప్పుడామె ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో ‘‘పైన పటారం..’’ అనే ప్రత్యేక గీతంలో హీరో కార్తికేయతో కలిసి కాలు కదిపారు. జేక్స్ బిజాయ్ స్వరాలందించారు. ఈ చిత్రం మార్చి 19న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆన్లైన్ వేదికగా మీడియాతో ముచ్చటించారు అనసూయ.
‘‘నటిగా అన్ని రకాల పాత్రలు పోషించాలనుంది. నేనెప్పుడూ నా పాత్ర నిడివి గురించి ఆలోచించను. సినిమా చూసి బయటకొచ్చిన ప్రేక్షకులకు నా పాత్ర గుర్తుండి పోతుందా? లేదా? అన్నదే ఆలోచిస్తా’’
‘‘ప్రత్యేక గీతాల విషయంలోనూ నా ఆలోచనలు అలాగే ఉంటాయి. ఓ పాటకి నేను న్యాయం చేయగలనని దర్శకులు నమ్మి, నా దగ్గరకొస్తే కచ్చితంగా చేస్తా. ఈ చిత్రంలోని ‘‘పైన పటారం..’’ గీతం నాకు మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉంది’’
‘‘ఓ చక్కటి జీవిత సత్యం తెలియజేస్తుంది. జేక్స్ తన రెగ్యులర్ మెలోడీలకు పూర్తి భిన్నంగా ఈ పాటని సిద్ధం చేశారు. ఈ పాటకి నేను బాగుంటానని దర్శకుడికి చెప్పింది జానీ మాస్టరే. కార్తికేయతో పోటీ పడి డ్యాన్స్ చేయడానికి కష్టపడ్డా. ఇప్పటి వరకు వచ్చిన మాస్ గీతాల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది’’.
‘‘ ప్రస్తుతం తెలుగులో ‘రంగమార్తాండ’, ‘ఖిలాడీ’, ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రాల్లో నటిస్తున్నా. తమిళ్లో ఓ సినిమా చేస్తున్నా. మలయాళంలో మమ్ముట్టితో ఓ చిత్రం చేయ బోతున్నా. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే రెండు వెబ్ సిరీస్లు చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు అనసూయ.