
తాజా వార్తలు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేయడమే లక్ష్యంగా రెండో విడత టీకా పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. 60 ఏళ్లు పైబడినవారితో పాటు దీర్ఘకాలిక రోగాలు కలిగిన 45ఏళ్లు పైబడిన వారికీ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. నిన్న ఉదయం 9గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 1గంట వరకు దేశ వ్యాప్తంగా 2,08,791మందికి పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, కరోనా వ్యాక్సిన్ల కోసం ప్రజలు నుంచి విశేష స్పందన లభిస్తోంది. వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన కొవిన్ పోర్టల్లో నిన్నటి నుంచి ఇప్పటివరకు 50లక్షల మంది తమ వివరాలను నమోదు చేయించుకున్నారని అధికారులు తెలిపారు.
ఆ రెండు రాష్ట్రాల్లోనే 75శాతం యాక్టివ్ కేసులు
మరోవైపు, దేశంలో కరోనా పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివరించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ యాక్టివ్ కేసుల 2శాతం కన్నా తక్కువగానే ఉన్నాయన్నారు. మరోవైపు దేశంలో రికవరీ రేటు 97శాతంగా ఉన్నట్టు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 1గంట వరకు దేశ వ్యాప్తంగా 1,48,55,073మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు తెలిపారు. తమిళనాడు, పంజాబ్లలో కేంద్ర బృందాలను నియమించామన్నారు. హరియాణాలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు రాజేశ్ భూషణ్ వెల్లడించారు. దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో 75శాతం మహారాష్ట్ర (78,825), కేరళ(48,159)లలోనే ఉన్నాయని వెల్లడించారు.
సూపర్ స్పెడర్ ఈవెంట్లకు దూరంగా ఉండండి
కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ సూచించారు. గుంపులకు దూరంగా ఉండాలని కోరారు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లుగా ఉన్న పార్టీలు, వివాహ వేడుకలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.