
తాజా వార్తలు
మళ్లీ తెరపై బాహుబలి
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాహుబలిగా ప్రభాస్ నటన యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుంది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రాన్ని వెండితెరపై చూసే అవకాశం మరోసారి కలుగనుంది. ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ఈ సంగతిని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. తొలిభాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ ఈ శుక్రవారం (నవంబర్ 6), రెండో భాగం ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆపై శుక్రవారం (నవంబర్ 13) విడుదల కానుందని ఆయన తెలిపారు. ఈ మేరకు చేసిన ట్వీట్ను ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలకు ఆయన ట్యాగ్ చేశారు.
బాహుబలి తొలిభాగం 2015లో, రెండోది 2017లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రాలు భారతీయ సినీ చరిత్రలోనే రికార్డు సృష్టించాయి. శివగామిగా రమ్యకృష్ణ అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్లు, మాహిష్మతి రాజ్యం సెట్ ఈ చిత్రాలకు అమిత ఆదరణ సంపాదించిపెట్టాయి.