
తాజా వార్తలు
ఆ మాట నేను అనలేదు: అనసూయ
హైదరాబాద్: ‘‘నాకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియా వేదికగా నన్ను అడిగి తెలుసుకోండి. అంతే కానీ, వేరేవాళ్లు రాసినవి గుడ్డిగా నమ్మేయకండి’’ అని అంటున్నారు నటి అనసూయ. బుల్లితెర వ్యాఖ్యాతగానే కాకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అనసూయ. తాజాగా కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’లో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ‘పైన పటారం...’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను చిత్రబృందం ఇటీవల అభిమానులతో పంచుకుంది.
కాగా, ఓ నెటిజన్.. ‘ఐటమ్ సాంగ్స్ చేయనన్నారు కదా. మరి ఇదేంటండి. అయినా ఆ లిరిక్స్ ఏంటి?’’ అంటూ అనసూయకు ట్వీట్ చేసింది. దీనిపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అది ఐటమ్ సాంగ్ కాదు. అసలు ఐటమ్ సాంగ్ అనేది లేదమ్మా. ఒక పాట కోసం, సినిమాలో ఉన్న నటీనటుల్ని కాకుండా ప్రత్యేకంగా వేరే ఎవరినైనా తీసుకున్నప్పుడు దాన్ని ‘స్పెషల్’ సాంగ్’ అంటారు. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసే కొందరు ఇచ్చిన పేరు (ఐటమ్సాంగ్) అది. లిరిక్స్ నచ్చడం వల్లే నేను ఆ స్పెషల్ సాంగ్ ఒప్పుకున్నాను. అంతే కాకుండా.. స్పెషల్ సాంగ్స్ చేయనని నేనెప్పుడూ చెప్పలేదు. నా గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే సోషల్ మీడియా వేదికగా నన్ను అడిగి తెలుసుకోండి. ఇప్పుడు చేసినట్లు వెటకారంగా కాకపోయినా, నిజాయతీగా తెలుసుకోవాలని మీకుంటే ట్వీట్ చేయండి.. నేను సమాధానమిస్తాను. అవాస్తవాలను దయచేసి గుడ్డిగా నమ్మకండి. నా నమ్మకాలు, అభిరుచులే నా కెరీర్. అంతేకానీ వేరే ఎవరో ఏదో రాస్తే అది నా కెరీర్ కాదు’’ అని అనసూయ సమాధానమిచ్చారు.