
తాజా వార్తలు
‘బాహుబలి’లో ఆ షాట్ గురించి తెలుసా..?
‘కృష్ణం వందే జగద్గురుమ్’ చూసి ‘బాహుబలి’కి ఓకే చేశారు: రానా
హైదరాబాద్: క్రిష్ దర్శకత్వం వహించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో నటన చూసి దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ ప్రాజెక్ట్లోకి తనని తీసుకున్నారని టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లీడర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన ఆ తర్వాత కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులను చూశారు. అయితే రానా వెండితెరకు పరిచయమై ఈ ఏడాదితో పదేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో #RD10 పేరుతో తన కెరీర్కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను రానా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన #RD10 ఛాప్టర్-1 వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తరుణంలో తాజాగా ఛాప్టర్-2 వీడియోను సురేశ్ ప్రొడెక్షన్స్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.
ఈ వీడియోలో రానా ‘లీడర్’ తర్వాత విడుదలైన ‘నేను నా రాక్షసి’, ‘నా ఇష్టం’, ‘డిపార్ట్మెంట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకున్నాయని అన్నారు. అనంతరం తాను కథానాయకుడిగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా చూసి ‘బాహుబలి’ సినిమాలోకి రాజమౌళి సెలక్ట్ చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆ సినిమా అనుకున్నాక 6 నెలలపాటు శరీరాకృతి, థియేటర్ క్లాస్ లాంటి పనుల్లో గడిపినట్లు వివరించారు. ‘బాహుబలి’ చిత్రంలో కాలకేయ రాజుతో యుద్ధం చేసే సీన్ను చిత్రీకరిస్తున్న సమయంలో కాలు బాగా బెణకడం వల్ల.. ఆరు వారాలుపాటు చాలా ఇబ్బంది పడ్డానని ఆయన తెలిపారు. అంతేకాకుండా వాహనంపై నిల్చొని కాలకేయ సైన్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఓ చిన్న గొలుసు సాయంతో తనని బంధించారని.. అందువల్లే తాను నిల్చొని యుద్ధం చేయగలిగానని చెప్పారు.
ఇదీ చదవండి
టెన్త్ తప్పిన రానా.. నటుడు ఎలా అయ్యాడంటే