
తాజా వార్తలు
ధోనీ సిక్స్తో ఊపిరిపీల్చుకున్నాం: సైమన్ టౌఫెల్
2011 ప్రపంచకప్: ప్రతి ఒక్కరికీ జెట్ప్లేన్ ఉందనిపించింది
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించి పదేళ్లు గడిచాయి. అయినా, ఆ జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో ఇంకా పదిలంగా ఉన్నాయి. అప్పుడు సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్లకు అంపైరింగ్ చేసిన సైమన్ టౌఫెల్.. తాజాగా నాటి విశేషాలను గుర్తు చేసుకున్నారు. ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్సర్తో ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. ఇటీవల ఐసీసీతో మాట్లాడిన మాజీ అంపైర్.. ఆ రెండు మ్యాచ్లకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు ఇలా పంచుకున్నారు.
‘మొహాలి వేదికగా భారత్-పాక్ తలపడిన సెమీఫైనల్స్ అద్భుతమైన మ్యాచ్. దాన్ని ఇంకో ఫైనల్ అని చెప్పొచ్చు. ఆరోజు ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం మనల్ని చూస్తున్నట్లుగా అనిపించింది. అలాగే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జెట్ ప్లేన్స్ ఉన్నాయేమో.. అవన్నీ చంఢీగడ్ ఎయిర్పోర్ట్లో పార్క్ చేశారేమో అనిపించింది. అప్పటికే తుదిపోరు జరగాల్సిన ముంబయి సంబరాలతో మునిగిపోయింది. దాన్ని నేను రెండో ఫైనల్స్గా భావిస్తా’ అని టౌఫెల్ పేర్కొన్నారు.
ఆ సిక్స్తో.. హమ్మయ్యా..
‘ఇక ఫైనల్లో ధోనీ చివర్లో సిక్సర్ కొట్టడం నాకింకా గుర్తుంది. హమ్మయ్యా.. ఎలాగోలా బతికిపోయాం. ఈ టోర్నీ నుంచి క్షేమంగా బయటపడ్డాం. కొంత మంది ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, మరికొంత మంది ఓదార్చుకుంటున్నారు. ఇక అంపైర్లుగా ఉన్న మాకైతే పెద్ద భారం తొలగిపోయినట్లు అనిపించింది. మా విభాగం నుంచి ఎలాంటి ఫిర్యాదులు, లేదా తప్పిదాలు జరగలేదని అనిపించింది. అలా అంతా సజావుగా జరగడంతో రూమ్కెళ్లి ఊపిరిపీల్చుకున్నాం’ అని టౌఫెల్ నాటి ఫైనల్ అనుభవాలను నెమరువేసుకున్నారు. కాగా, సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను మట్టికరిపించిన భారత్, ఆ తర్వాత ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ధోనీ(91*) చిరస్మరణీయ ఇన్నింగ్స్తో వెలకట్టలేని అనుభూతి కలిగించాడు. దాంతో యావత్ భారత దేశం సంబరాల్లో మునిగిపోయింది.