Aided schools: ఎయిడెడ్‌ విలీనంపై.. ఇక మీ ఇష్టం

ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతి తెలిపిన యాజమాన్యాలు కూడా ఇప్పుడు తమ

Updated : 13 Nov 2021 06:44 IST

సమ్మతిచ్చినా వెనక్కి తీసుకోవచ్చు
సిబ్బంది, ఆస్తులను ఇవ్వనక్కర్లేదు
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగుతుంది
ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వు
ఈనాడు - అమరావతి

బ్యారికేడ్లు నెట్టుకుని కలెక్టరేట్‌లోకి వెళ్తున్న విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు

ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతి తెలిపిన యాజమాన్యాలు కూడా ఇప్పుడు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర శుక్రవారం మెమో జారీ చేశారు. ఇటీవల సీఎం జగన్‌ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనానికి గతంలో మూడు ఐచ్ఛికాలు ఇవ్వగా.. ఇప్పుడు అంగీకారాన్ని వెనక్కి తీసుకునే ఐచ్ఛికాన్ని కూడా చేర్చారు. పాఠశాల, జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలకు కలిపి ఈ మెమో ఇచ్చారు.

నాలుగు ఐచ్ఛికాలు.

1. ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఆస్తులతో సహా సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలుగా నిర్వహిస్తారు.
2. ఆస్తులు ఇవ్వకుండా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు లిఖిత పూర్వక సమ్మతి తెలిపితే ఆ విద్యా సంస్థలను ప్రైవేటుగా సంస్థలుగా నిర్వహించుకోవాలి.
3. ఎలాంటి సమ్మతీ తెలపకుంటే ప్రస్తుత నిబంధనల మేరకే ఎయిడ్‌ కొనసాగిస్తారు.
4. గతంలో ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతి తెలిపిన యాజమాన్యాలు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యథావిధిగా ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా నిర్వహించుకోవచ్చు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగుతుంది.
రాష్ట్రంలో 137 ఎయిడెడ్‌ కళాశాలల్లో 124 యాజమాన్యాలు సిబ్బందిని అప్పగించేందుకు సమ్మతి తెలిపాయి. కళాశాలల్లోని సిబ్బందిని అధికారులు ప్రభుత్వంలో విలీనం చేశారు. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఇప్పటికే పోస్టింగ్‌లు ఇచ్చేశారు. ఇప్పుడు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సమ్మతిని వెనక్కి తీసుకుంటే సిబ్బందిని ఎలా సర్దుబాటు చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఎయిడెడ్‌ సిబ్బందికి పోస్టులు ఇచ్చేందుకు గతంలో రెగ్యులర్‌ సిబ్బందికి బదిలీలు నిర్వహించారు. అనంతరం ఖాళీల్లో ఎయిడెడ్‌ సిబ్బందిని నియమించారు. ఇప్పుడు ప్రభుత్వం ఎయిడెడ్‌ సిబ్బందిని వెనక్కి పంపుతామన్నా వారు వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

విశ్వవిద్యాలయాల్లో పోస్టింగ్‌..
పీహెచ్‌డీ అర్హత ఉన్న ఎయిడెడ్‌ అధ్యాపకులకు విశ్వవిద్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. సుమారు 342మంది వరకు పీహెచ్‌డీ అర్హత కలిగి ఉన్నారు. వీరిలో 113 మందిని మూడేళ్లపాటు డిప్యూటేషన్‌పై ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కేటాయించారు. మిగతా వారిని రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు ఇచ్చారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని