కేంద్రం, ఓఎన్‌సీజీకి సుప్రీం నోటీసులు

దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వేదాంతా దాఖలు చేసుకున్న అప్పీలుపై స్పందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated : 13 Aug 2022 04:12 IST

బామర్‌ చమురుక్షేత్రంపై వేదాంతా అప్పీలు నేపథ్యం

దిల్లీ: దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వేదాంతా దాఖలు చేసుకున్న అప్పీలుపై స్పందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘ఉత్పత్తి పంపక ఒప్పందాన్ని మరో 10 ఏళ్ల పాటు పొడిగిస్తే, బామర్‌ చమురు క్షేత్రం (రాజస్థాన్‌) నుంచి ఉత్పత్తి చేసిన చమురుపై వచ్చిన లాభాల్లో 10 శాతం అధిక వాటాను ప్రభుత్వం కోరవచ్చ’ని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. వేదాంతా, ఓఎన్‌జీసీలతో కుదుర్చుకున్న పీఎస్‌సీని 2030 వరకు పొడిగించాలంటూ కేంద్రానికి ఏక సభ్య ధర్మాసనం జారీచేసిన ఆదేశాలను పక్కనపెడుతూ 2021 మార్చి 26న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై వేదాంతా అప్పీలు చేయగా, సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. వేదాంతా తరఫు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పెట్రోలియం, సహజ వాయువు శాఖ; డైరెకర్‌ జనరల్‌ ఆఫ్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌; ఓఎన్‌జీసీలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. స్పందించడానికి 4 వారాల గడువు ఇవ్వాలంటూ సీనియర్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనాన్ని కోరగా, సెప్టెంబరులో విచారణ చేపడతామంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని