Cyclone Jawad: గంటకు 30 కి.మీ వేగంతో ‘జవాద్‌’: ఏపీ విపత్తుల నిర్వహణ కమిషనర్‌

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు 770 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Updated : 03 Dec 2021 14:09 IST

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దూసుకొస్తోంది. రానున్న ఆరు గంటల్లో ఇది తుపాను (జవాద్‌గా పిలుస్తున్నారు)గా మారనుంది. ప్రస్తుతం ఇది విశాఖకు 480 కి.మీ.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 600 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 30 కి.మీ వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన చెప్పారు.

శనివారం ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని కన్నబాబు వివరించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. రేపు ఉదయం నుంచి 80-90కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సోమవారం వరకు చేపలవేటకు వెళ్లరాదని తెలిపారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటి పారుదల మార్గాలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుపాను సహాయక చర్యల కోసం ఇప్పటి వరకు 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అదనంగా మరో 4 బృందాలను అందుబాటులో ఉంచామన్నారు.

విశాఖలో కంట్రోల్‌ రూం ఏర్పాటు..

తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జీవీఎంసీ, పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను సహాయక చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, 55 ఎస్డీఆర్‌ఎఫ్‌ సభ్యులను సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. 0891-2590100, 0891-2590102, 0891-2750089, 0891-2750090, 0891-2560820 నంబర్లతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని.. సహాయం కోసం ఈ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని జిల్లా అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం.. 11 మండలాల్లో తీవ్రత ఉండే అవకాశం: సమీక్షలో ధర్మాన కృష్ణదాస్‌

జవాద్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. తాగునీటి కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని