Covid-19: కరోనా ఒక్క కేసూ నమోదు కాని దేశాలేవో తెలుసా?

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా కొన్ని దేశాల్లో అడుగుపెట్టలేకపోయింది. మరి ఇప్పటివరకు కరోనా ఒక్క కేసు కూడా నమోదు కానీ ఆ దేశాలేవో తెలుసుకుందామా..

Published : 27 Jan 2022 01:32 IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. రెండేళ్లుగా ఈ వైరస్‌ వివిధ రూపాంతరాలు చెందుతూ ప్రపంచదేశాలను వణికిస్తోంది. అయితే, ఇప్పటికీ కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన జాబితా ప్రకారం.. ఆరు దేశాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం గమనార్హం. డబ్ల్యూహెచ్‌వో తొలుత ఏడు దేశాలని ప్రకటించినా తాజాగా ఒక ద్వీప దేశంలో పెద్దఎత్తున కేసులు వెలుగుచూడటంతో తొలిసారి లాక్‌డౌన్‌ కూడా విధించారు. మరి ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాని ఆ దేశాలేవో తెలుసుకుందామా..


తుర్కెమెనిస్థాన్‌..

మధ్య ఆసియా దేశాల్లో ఒకటైన తుర్కెమెనిస్థాన్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. ఈ దేశం కాస్పియన్‌ సముద్రం, కరక్కమ్‌ ఎడారి సరిహద్దులుగా కలిగి ఉంది. కరోనా ప్రారంభ దశ నుంచి తుర్కెమెనిస్థాన్‌లోని అధికార ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కరోనాను కట్టడి చేస్తోంది. విదేశాలకు వెళ్లే విమానాలను తప్ప అన్నీ సరిహద్దులను మూసివేసింది. స్వదేశానికి తిరిగి వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌, రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకుంటేనే అనుమతిస్తోంది. ఆ దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రారంభంలోనే ఆదేశించింది. ఈ విధంగా ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ కరోనా రహిత దేశంగా పేరు తెచ్చుకుంది.


కుక్‌ ఐలాండ్స్‌..

దాదాపు 17 వేల జనాభా కలిగిన కుక్‌ ఐలాండ్స్‌లోనూ రెండేళ్లుగా ఒక్క కరోనా కేసు నమోదుకాలేదు.  ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన దేశాల్లో కుక్‌ ఐలాండ్స్‌ ఒకటి. పసిఫిక్‌ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశంలో అర్హులైనవారిలో దాదాపు 97 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలోనే ఈ దేశం ఇతర దేశాల నుంచి రాకపోకలను నిషేధించింది. ఇటీవలే జనవరి 13 నుంచి న్యూజిలాండ్‌తో క్వారంటైన్‌ రహిత ప్రయాణాలను పునఃప్రారంభించింది. అయితే, రెండేళ్లుగా ఒక్క కేసు నమోదు కాని ఈ దేశంలో తాజాగా తొలి కేసు నమోదు కావడం గమనార్హం. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నియంత్రణ చర్యలను కట్టుదిట్టం చేయడంతో ఆ తర్వాత ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.


ఉత్తర కొరియా

ఉత్త‌ర కొరియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేద‌ని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో సైతం పునరుద్ఘాటించింది. ఇప్పటికీ ఉత్తర కొరియా దేశంలోకి పర్యాటకులను అనుమతించట్లేదు. ఇతర దేశాల నుంచి ఉత్పత్తుల దిగుమతిని నిలిపివేసింది ఆ దేశ ప్రభుత్వం. వ్యాక్సిన్ డోసులను కూడా దిగుమతి చేసుకోకుండా ఉత్తర కొరియా తిరస్కరిస్తూనే వస్తోంది. కఠిన ఆంక్షల మధ్య వ్యాక్సిన్‌/బిజినెస్ సర్టిఫికెట్ ప్రాతిపదికన దేశాల మధ్య ప్రయాణాలను తాజాగా పునఃప్రారంభించినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించాయి.


టేకెలావ్‌..

హవాయి, న్యూజిలాండ్‌ దేశాల మధ్య చిన్న చిన్న ద్వీపాల సమూహమే టేకెలావ్‌.  ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. ఈ ద్వీప దేశంలోనూ కరోనా అడుగుపెట్టలేదు. టేకెలావ్‌లో దాదాపు 68.6శాతం జనాభాకు రెండు డోసుల టీకాను అందించింది.


నౌరు..

ఆస్ట్రేలియాకు ఈశాన్య ప్రాంతంలో మైక్రోనేషియాలో ఉన్న అతి చిన్న ద్వీప దేశం నౌరు.  ఈ దేశ మొత్తం జనాభా 10,834 మంది మాత్రమే. 2021లోనే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి.. 100 శాతం వ్యాక్సినేషన్‌ అందించిన దేశాల జాబితాలో నిలిచింది. గతేడాది డిసెంబరు 31 నుంచి రెండు డోసుల టీకా తీసుకున్న సందర్శకులను మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.


తువాలు..

దక్షిణ పసిఫిక్‌లో ఉన్న తువాలు ద్వీప దేశంలోనూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. కరోనా ప్రారంభ దశలోనే కఠినమైన ఆంక్షలు విధించింది ఈ దేశం. సరిహద్దులను పూర్తిగా మూసివేసి, ప్రయాణాలను నిషేధించింది. ఏప్రిల్ 2021లో పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టింది. కరోనాను దేశంలో అడుగుపెట్టనీయకుండా వ్యూహాత్మకమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.

ఇవేకాకుండా మధ్య పసిఫిక్‌లోని కిరిబిటీ ద్వీప దేశంలోనూ మొన్నటి వరకూ ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాలేదు. కానీ, తాజాగా (జనవరి 23న) విదేశాల నుంచి ఈ దేశంలో అడుగుపెట్టిన వారిలో (36 మందికి) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తొలిసారి ఈ దేశంలో లాక్‌డౌన్‌ కూడా విధించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు దాదాపు 1.20 లక్షల జనాభా ఉన్న కిరిబాటీ దేశంలో ఇప్పటివరకు కేవలం 34 శాతం (11,686 మందికి) మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు