Telangana Schools: సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభం 

Telangana Schools Reopening: కరోనా మహమ్మారి శాంతించడంతో  తెలంగాణలో విద్యాసంస్థలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 23 Aug 2021 21:45 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి శాంతించడంతో  తెలంగాణలో విద్యాసంస్థలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో పాటు విద్య, వైద్య, పురపాలిక, పంచాయతీరాజ్‌, ఆర్థిక శాఖల అధికారులు, గురుకులాల కార్యదర్శులతో సీఎం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యాసంస్థల పునఃప్రారంభానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. విద్యాసంస్థల మూసివేతతో విద్యార్థులపై పడుతున్న మానసిక ఒత్తిడి, సంబంధిత అంశాలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో వాటిన్నింటిపై  విస్తృతంగా చర్చించి సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అన్ని రకాల ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, అంగన్‌వాడీలను కూడా తెరవాలని నిర్ణయించారు. అన్ని విద్యాసంస్థలు, వసతిగృహాలను నెలాఖరులోగా శుభ్రపరచి, శానిటైజేషన్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లదేనని సీఎం స్పష్టం చేశారు. నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లు సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటి రసాయనాలతో పరిశుభ్రం చేయాలని తెలిపారు. విద్యాసంస్థల పరిధిలోని నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. విద్యాసంస్థలు తెరిచాక గురుకులాల్లోని విద్యార్థులకు జ్వరసూచన ఉంటే ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వెంటనే సమీపంలోని పీహెచ్ సీకి తీసుకెళ్లి కొవిడ్ పరీక్షలు చేయించాలని సీఎం తెలిపారు. ఒకవేళ కొవిడ్ నిర్ధరణ అయితే వారి తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు.  విద్యార్థులు విధిగా మాస్కులు ధరించేలా, శానిటైజేషన్ చేసుకోవడం లాంటి కొవిడ్ నియంత్రణ చర్యలు తీసుకునేలా చూడాలని తల్లిదండ్రులను ముఖ్యమంత్రి కోరారు.

కరోనాతో విద్యారంగంలో అయోమయం...

 ‘‘ కరోనా వల్ల విద్యారంగంలో అయోమయం నెలకొంది. విద్యార్థులు, ప్రైవేటు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యశాఖ అధికారులతో చర్చించాం. కరోనా అదుపులోకి వచ్చిందని నివేదికలు వచ్చాయి. ఎక్కువ కాలం పాఠశాలలు మూసివేస్తే పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది. పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని వైద్యశాఖ అధికారులు చెప్పారు’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కరోనా ప్రభావంతో గత మార్చిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. మధ్యలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడంతో మళ్లీ ఆన్‌లైన్‌ బోధనకే పరిమితం చేశారు. గత నెల ఒకటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఈనెలలోనే విద్యాసంస్థలు తెరిచాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని