Ts News: ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: డీహెచ్‌ శ్రీనివాస్‌

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు ...

Updated : 28 Nov 2021 16:07 IST

హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌ తెలిపారు. కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై, ప్రభుత్వ సన్నద్ధతపై రెండు గంటల పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం డీహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమీక్షకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ నియంత్రణకు ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను పరిశీలిస్తున్నామని.. రాష్ట్రంలో కేసుల పెరుగుదల నిలకడగానే ఉందని వెల్లడించారు.

‘‘ఇప్పటివరకు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఎక్కడా నమోదు కాలేదు. కొత్త వేరియంట్ దేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ జరుగుతోంది. అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. 14 రోజుల పాటు హోమ్ క్వారైంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఆందోళన చేందాల్సిన అవసరం లేదు. నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో 200 లోపే కొవిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు,  45 శాతం రెండో డోసు ఇచ్చాం. వ్యవధి గడిచినా రెండో డోసును 25 లక్షల మంది తీసుకోలేదు. కరోనా కేసులు తగ్గడంతో వ్యాక్సిన్ పట్ల, కరోనా నిబంధనలు పాటించడంలో కొంత నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించాం. ఏ వేరియంట్‌ను అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉంది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి మర్చిపోవద్దు. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి’’ అని డీహెచ్‌ పేర్కొన్నారు.

బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలి: డీఎంఈ రమేష్‌రెడ్డి

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. ప్రజలు బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఇతర జాగ్రత్తలు పాటించాలన్నారు. వైరస్ ఉత్పరివర్తనాలు చాలా జరుగుతాయని పేర్కొన్నారు. కరోనా కొత్తరకం వేరియంట్ ఎంత ప్రమాదకరం అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని