Ts News: పుప్పాలగూడ, ఖానామెట్‌ భూముల వేలం వాయిదా: టీఎస్‌ఐఐసీ

ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పుప్పాలగూడ, ఖానామెట్‌ భూముల వేలం వాయిదా పడింది.  కోర్టు కేసుల నేపథ్యంలో వేలాన్ని వాయిదా వేసినట్లు టీఎస్‌ఐఐసీ ప్రకటించింది...

Published : 26 Sep 2021 16:50 IST

హైదరాబాద్‌: ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పుప్పాలగూడ, ఖానామెట్‌ భూముల వేలం వాయిదా పడింది. కోర్టు కేసుల నేపథ్యంలో వేలాన్ని వాయిదా వేసినట్లు టీఎస్‌ఐఐసీ తెలిపింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని భూముల వేలానికి సంబంధించి టీఎస్‌ఐఐసీ జారీ చేసిన నోటిఫికేషన్‌లోని మరికొన్ని ప్లాట్ల వేలాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ భూములను వేలం వేయడాన్ని సవాలు చేస్తూ రామచందర్‌సింగ్‌ మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. సర్వే నం.326, 327, 301, 303ల్లో ఉన్న 13, 14, 15, 24, 27, 30 ప్లాట్‌ల వేలాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నంబర్లలో కాందిశీకులకు చెందిన 18 ఎకరాల భూమి వివాదంలో ఉండగా ప్రభుత్వం వేలం వేయడం సరికాదంటూ వేలాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలోని ఖానామెట్‌ భూముల వేలం ప్రక్రియ జరిగింది. అక్కడున్న 14.91 ఎకరాలను 5 ప్లాట్లుగా విభజించి హెచ్‌ఎండీఏ ఆన్‌లైన్‌ వేలం నిర్వహించగా రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. భూముల వేలంలో ఎకరం సగటు ధర రూ.48.92 కోట్లు, గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలో వాణిజ్యపరమైన సముదాయాలు, వినోదభరిత ప్రాంతాలు, రవాణా సౌకర్యం ఉండడంతో ఖానామెట్‌ భూములు అధిక ధర పలికాయి. భూములకు ఎలాంటి చిక్కులు లేవని, సింగిల్ విండో ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో త్వరితగతిన అనుమతులు ఇస్తామని టీఎస్ఐఐసీ వేలం సందర్భంగా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని