Obesity: లావైపోతున్న భారత్‌.. పెరిగిపోతోన్న ఊబకాయం

దేశంలో ఊబకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయ సమస్య అందరినీ వేధిస్తోంది. చిన్నారులను సైతం వీడటం లేదు.....

Updated : 28 Nov 2021 18:57 IST

దిల్లీ: దేశంలో ఊబకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా ఊబకాయ సమస్య అందరినీ వేధిస్తోంది. చిన్నారులను సైతం వీడటం లేదు. ఐదేళ్లలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​) తాజాగా వెల్లడించింది. దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వయసుకు మించి బరువు ఉన్న చిన్నారుల సంఖ్యలో పెరుగుదల నమోదైనట్లు ఎన్​ఎఫ్​హెచ్​ఎస్ ఐదో సర్వేలో పేర్కొంది. శారీరక శ్రమ లేకపోవటం, సరైన ఆహార నియమాలు పాటించకపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

సర్వేలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

* కుటుంబ ఆరోగ్య సర్వే-4(2015-16)తో పోలిస్తే ఐదో సర్వేలో అధిక బరువు ఉన్న చిన్నారులు 2.1 శాతం నుంచి 3.4 శాతానికి చేరుకున్నారు.

* తాజా సర్వే ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్​, త్రిపుర, లక్షద్వీప్​, జమ్ముకశ్మీర్​, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, బెంగాల్​, ఆంధ్రప్రదేశ్​, లద్దాఖ్​లో ఐదేళ్లలోపు పిల్లల్లో అధిక బరువు ఉన్నవారి సంఖ్య పెరిగింది.

* గోవా, తమిళనాడు, దాద్రానగర్​ హవేలీ, దామన్ దయూలలో మాత్రమే ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఊబకాయుల సంఖ్యలో తగ్గుదల నమోదైంది.

* దేశవ్యాప్తంగా కేవలం చిన్నారుల్లోనే కాదు.. మహిళలు, పురుషుల్లోనూ ఊబకాయం పెరిగిపోతోంది. మహిళల్లో 20.6 శాతం నుంచి 24 శాతానికి, పురుషుల్లో 18.9శాతం నుంచి 22.9 శాతానికి చేరింది.

* 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. మహిళల్లో స్థూలకాయులు పెరిగారు. 33 రాష్ట్రాలు, యూటీల్లో పురుషుల్లో ఊబకాయుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది.

చిన్నారులు సహా పెద్దవారిలోనూ ఊబకాయులు పెరిగిపోవడానికి శారీరక శ్రమ తగ్గిపోవటం, ఆహార పద్ధతులే కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై పాపులేషన్​ ఫౌండేషన్ ఆఫ్​ ఇండియా సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ పూనమ్​  మాట్లాడారు. ‘గత 15 ఏళ్లుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కారణంగా ప్రజల ఆదాయాలు పెరిగాయి. ఆర్థికంగా ఎదగటమే భారతీయుల్లో ఊబకాయం పెరగటానికి కారణమని మనందరికీ తెలుసు. ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​-4 ప్రకారం అల్పాదాయ వర్గాల్లోని పురుషుల్లో స్థూలకాయులు 5 శాతం, మహిళలు 6శాతం ఉంటే, అధికాదాయ వర్గాల్లో పురుషులు 33 శాతం, మహిళలు 36 శాతం ఉన్నారు’ అని పూనమ్‌ పేర్కొన్నారు. అయితే ఆదాయం పెరగటం ఒక్కటే కారణంగా చూపలేమని, ఆహార అలవాట్లు సరిగా లేకపోవటం మరో ప్రధాన సమస్యగా తెలిపారు. జంక్ ఫుడ్స్​ వంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల బరువు పెరిగిపోతున్నట్లు ఆమె వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని