Gaza: ఆగని విధ్వంసకాండ

హమాస్‌ తీవ్రవాదుల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ మంగళవారం కూడా ఉద్ధృత స్థాయిలో వైమానిక దాడులు చేసింది.

Updated : 19 May 2021 16:33 IST

ఉద్ధృతంగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

గాజా నుంచి హమాస్‌ రాకెట్ల ప్రయోగం


గాజా సిటీ: హమాస్‌ తీవ్రవాదుల అంతమే :లక్ష్యంగా ఇజ్రాయెల్‌ మంగళవారం కూడా ఉద్ధృత స్థాయిలో వైమానిక దాడులు చేసింది. గాజా నగరంలో విద్యా సంస్థలు, పుస్తక విక్రయ కేంద్రాలు ఉన్న ఆరు అంతస్తుల భవనాన్ని మంగళవారం నేలమట్టం చేసింది. అందులో ఉంటున్నవారిని ముందుగానే హెచ్చరించి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. హమాస్‌ కమాండర్ల నివాసాలు సహా 65 లక్ష్యాలపై సైనిక దళాలు దాడులు నిర్వహించి, ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. దీనిలో 60కి పైగా జెట్‌ విమానాలు పాల్గొన్నట్లు ప్రకటించింది. దాడుల కారణంగా వైద్య సేవలకూ తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. మరోవైపు హమాస్‌ సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించింది. దక్షిణ ఇజ్రాయెల్‌పై జరిగిన రాకెట్‌ దాడిలో థాయిలాండ్‌కు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్‌లో అంతర్గత ఘర్షణలు చెలరేగాయి. ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో ఉంటున్న పాలస్తీనియన్లు ఒక్కటై నిరసనలకు దిగారు. సైనిక చెక్‌పోస్ట్‌పై రాళ్లు విసిరారు. 

కాల్పుల విరమణకు బైడెన్‌ మద్దతు

ఇజ్రాయెల్‌- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా.. అమెరికా కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణకు అధ్యక్షుడు జో బైడెన్‌ మద్దతు పలికారని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో జరిగిన ఫోన్‌ సంభాషణలో స్పష్టం చేసినట్లు తెలిపింది. దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రాంతీయ అరబ్‌ నేతలతో, పాలస్తీనా నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ సంప్రదింపులు జరిపారు. గాజాలోని భవనాలపై జరిగిన దాడుల గురించి అమెరికా దృష్టికి ఇజ్రాయెల్‌ తీసుకువెళ్లింది. గాజా పునర్నిర్మాణానికి 50 కోట్ల డాలర్ల సాయం అందించనున్నట్లు ఈజిప్ట్‌ ప్రకటించింది. 

38 వేల మంది గల్లంతు! 

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల కారణంగా గాజాలోని 38 వేల మంది పాలస్తీనా ప్రజల ఆచూకీ తెలియడం లేదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 41 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. గాజాలో విద్యుత్‌ సరఫరా తీవ్రంగా దెబ్బతిందని.. వైద్యం, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోందని తెలిపింది. గాజాలో పరిస్థితిపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా చికాగోలోని భారతీయ అమెరికన్లు ర్యాలీ నిర్వహించారు. హమాస్‌ వర్గం.. యూదులపై ఉగ్రదాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని