కొవిడ్‌ టీకా: ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..!

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శరీరంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఎన్నిరోజుల సమయం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated : 01 Jan 2021 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఫైజర్‌ టీకా తీసుకున్న పదిరోజులకు ఓ అమెరికన్‌ నర్సుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తర్వాత వ్యాక్సిన్‌ తీసుకున్న మరికొందరిలోనూ వైరస్‌ బయటపడినట్లు అమెరికా వైద్యులు గుర్తించారు. ఈ ఘటనలతో కొందరిలో ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఇలాంటి కేసులు సహజమేనని.. ఇది ఊహించినదేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శరీరంలో రోగనిరోధకత(ఇమ్యూనిటీ) పెరగడానికి ఎన్నిరోజుల సమయం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న వెంటనే వైరస్‌ నుంచి రక్షణ కలుగుతుందనే భావన కొందరిలో ఉంది. అయితే, కరోనా వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్నాక శరీరంలో దాని ప్రభావం చూపేందుకు పది నుంచి 14రోజుల సమయం పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్పుడు కూడా కేవలం 50శాతానికి పైగా మాత్రమే రోగనిరోధకత వస్తుందని..రెండో డోసు తీసుకున్న తర్వాతే పూర్తి రోగనిరోధకత వస్తుందని స్పష్టంచేస్తున్నారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్‌కు కారణమయ్యే వైరస్‌ను గుర్తించి రోగ నిరోధక శక్తిని సంసిద్ధం చేయడంలో తొలి డోసు ఉపయోగపడుతుందని.. ఇక వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా ఆ రోగనిరోధక శక్తిని మరికొన్ని నెలల పాటు కొనసాగించడం రెండో డోసు తర్వాతే లభిస్తుందని అంటున్నారు. కాలిఫోర్నియా నర్సు విషయంలో మాత్రం వ్యాక్సిన్‌ తీసుకున్న రోజు లేదా మరుసటి రోజు వైరస్‌ సోకి ఉంటుందని.. అందుకే టీకా తీసుకున్న ఆరు రోజుల్లోనే లక్షణాలు బయటపడినట్లు నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్‌ తన పని చేసేందుకు కావాల్సిన సమయం లభించకపోవడం వల్లే అలాంటి ఘటనలు జరుగుతాయని వివరిస్తున్నారు.

వ్యాక్సిన్‌లు ఎలా పనిచేస్తాయంటే..!
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో వ్యాక్సిన్‌లు దోహదం చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే, వివిధ వ్యాక్సిన్‌లు వేర్వేరు పనితీరును చూపించినప్పటికీ అన్ని టీకాల లక్ష్యం మాత్రం ఒక్కటే. శరీరంలో వైరస్‌ ప్రవేశించినప్పుడు వాటిని గుర్తించి మెమొరీ కణాలుగా పిలిచే టీ-లింఫోసైట్స్‌, బీ-లింఫోసైట్లను సరఫరా చేయడమే వాటి కర్తవ్యం. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ కణాలను ఉత్పత్తి చేసేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. వ్యాక్సిన్‌ నుంచి రక్షణ పొందేందుకు సాధారణంగా 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందని అమెరికా సీడీసీ నిపుణులు క్రిష్టియన్‌ రామర్స్‌ స్పష్టంచేశారు. అందుకే వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ ఒక్కోసారి వైరస్‌ లక్షణాలు బయటపడుతాయని పేర్కొన్నారు. ఇక మరికొన్ని సార్లు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగనిరోధకత పెరుగుతున్న సమయంలోనూ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం రోగనిరోధకతను వృద్ధి చేసుకుంటోందనడానికి గుర్తుగా ఆ లక్షణాలను భావించాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటే, వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భాగంగా, తొలి డోసు తీసుకున్న తర్వాత ఇస్ట్రాజెనెకా-70శాతం, ఫైజర్‌-82శాతం, మోడెర్నా-92శాతం సమర్థత చూపించినట్లు వెల్లడించాయి. రెండో డోసు తీసుకున్నాక దాదాపు 95శాతం సమర్థత చూపించాయని ప్రకటించాయి. ఇక తీవ్ర కేసుల్లో మాత్రం వందశాతం రక్షణ కల్పిస్తాయని ఆయా సంస్థలు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో వెల్లడించాయి. అందుకే వ్యాక్సిన్‌ తీసుకునేవారు కచ్చితంగా రెండు డోసులను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..
వ్యాక్సిన్‌... అలా మొదలైంది..!
వైరస్‌ సోకిన వారూ టీకా తీసుకోవాలి..!
కరోనా టీకా: ఇవి తెలియాలి మరి!
కరోనా టీకా తీసుకున్నాక ఎలా ఉంటుందంటే?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని