China: జిన్‌పింగ్‌ గర్వించేలా ఆమె..!

హాంకాంగ్‌ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంగ్‌కాంగ్‌ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతం చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ

Published : 07 Dec 2021 02:12 IST

 మినీ చైనాను తలపించేలా హాంకాంగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

హాంకాంగ్‌ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంకాంగ్‌ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతపు చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ ప్రజలు చేసిన ఉద్యమాన్ని చూసి భయంతో కన్నీటి పర్యంతమైన హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెరీ లామ్‌.. ఇప్పుడు విజృంభిస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లల్లో బంధిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా మెల్లగా ఈ ఆంక్షలను అలవాటు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. స్వేచ్ఛాయుత ప్రదేశంగా హాంకాంగ్‌కు ఉన్న గుర్తింపు కనుమరుగవుతోందన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని సర్దుకుపోతున్నారు. హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇటీవల గ్వాంగ్జూలో మాట్లాడుతూ మరో బాంబు పేల్చారు. ఆన్‌లైన్‌లో భావప్రకటనను నియంత్రించనున్నట్లు వెల్లడించారు.

ఇంటర్నెట్‌, మీడియాను అదుపు చేస్తూ..

ఇంటర్నెట్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రస్తుత చట్టాలతో ప్రయోజనం లేదని కెరీ లామ్‌ అన్నారు. వేర్పాటువాదం, విష ప్రచారం చేసేవారిని అరికట్టేందుకు  ‘ఫేక్‌ న్యూస్‌’ చట్టాన్ని మేలో అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిలో చట్టపరమైన అంశాలపై పరిశీలన జరుగుతోంది. దీంతోపాటు సైబర్‌ సెక్యూరిటీ లా కూడా తయారు చేయడానికి హాంకాంగ్‌ సిద్ధమైపోయింది. ఇందులో ఇంటర్నెట్‌ ప్రొవైడర్లను కీలకమైన మౌలిక సదుపాయాలుగా వర్గీకరించనున్నారు. ఫలితంగా ఆన్‌లైన్‌ కంటెంట్‌పై ప్రభుత్వానికి బలమైన పట్టు లభిస్తుందని భావిస్తున్నారు. 

ఇప్పటికే చైనా ఆమోదించిన నేషనల్‌ సెక్యూరిటీ చట్టాన్ని హాంకాంగ్‌ అధికారులు ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం కింద వేర్పాటువాదం, విదేశీ శక్తులతో కుమ్మక్కవ్వడం, తీవ్రవాదం  వంటి వాటిని నేరాలుగా పరిగణించి శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. చైనా నుంచి హాంకాంగ్‌ను వేరు చేయడంపై మాట్లాడటం, రాయడం వంటివి చేయడం నేరం. అటువంటి మీడియా హౌసులను మూసివేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దీంతో హాంకాంగ్‌ అధికారులు దీనిని కళాశాలలు, మ్యూజియంలు, సినీ నిర్మాతలపై ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడి పరిస్థితి ఏ స్థాయికి చేరుతుందో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి.

కీలక సంస్థలు పలాయనం..

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదే 47 విదేశీ సంస్థల ప్రాదేశిక ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్‌ నుంచి తొలగించారు. వీటిల్లో అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌ దేశాల కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. 6 ప్రపంచ స్థాయి బ్యాంకులు, 4 అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు వీటిలో ఉన్నాయి. కానీ, 14 చైనా కంపెనీల రీజనల్‌ ఆఫీస్‌లు కొత్తగా వచ్చి చేరాయి. ‘‘చైనా ప్రధాన భూభాగంలో వ్యాపారం చేయడం ఎంత రిస్క్‌తో కూడుకున్నదో.. అంతే రిస్క్‌ హాంకాంగ్‌లో కూడా ఉందని భావిస్తున్నాం’’ అని ఓ అంతర్జాతీయ బ్యాంక్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వద్ద వ్యాఖ్యానించారు. చైనాలో మాదిరిగా దీర్ఘకాలం సరిహద్దులు మూసివేయడం, కఠినమైన క్వారంటైన్‌ నిబంధనల కారణంగా కంపెనీలు ఈ ప్రాంతాన్ని వీడుతున్నాయి.

చైనా కబంధ హస్తాల్లోకి హాంకాంగ్‌..

* 1997లో హాంకాంగ్‌ నిర్వహణ బాధ్యతలను బ్రిటన్‌ నుంచి  చైనాకు అప్పజెప్పారు. 2047 వరకు హాంకాంగ్‌ రాజ్యాంగం అమల్లో ఉండాలి.

* 2014లో ప్రజాస్వామ ఉద్యమైన అంబ్రిల్లా ఉద్యమం చోటు చేసుకొంది.

* 2019లో చైనాకు నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఈ బిల్లు ఉపసంహరిస్తామని హాంకాంగ్‌ సీఈవో కెరీ లామ్‌ ప్రకటించారు.

* 2020 మార్చిలో కొవిడ్‌ వ్యాప్తితో హాంకాంగ్‌ సరిహద్దులు మూసివేసింది. దీంతో చైనా, ఇతర ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయి.

* 2020 జూన్‌లో స్థానిక చట్టాలను పక్కకు తప్పిస్తూ బీజింగ్‌ నేషనల్‌ సెక్యూరిటీ లాను విధించింది.

* 2020లో ఐరోపా సంఘంతో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు, పరస్పర న్యాయ సహకార ఒప్పందాలను హాంకాంగ్‌ రద్దు చేసుకొంది.

* 2021 జనవరిలో 50 మందిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి జైల్లో వేసింది.

* 2021 మార్చిలో హాంకాంగ్‌ ఎన్నికల విధానంలో చైనా మార్పులు చేయడం మొదలుపెట్టింది. 

* హాంకాంగ్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం రిస్క్‌గా పేర్కొంటూ అమెరికా 2021 జులైలో అడ్వైజరీ జారీ చేసింది. 

* 2021 ఆగస్టులో సరిహద్దులను తెరవాలని ఐరోపా సమాఖ్య కోరింది.

* చైనాతో సరిహద్దులు తెరవడం తమ ప్రాధాన్యమని హాంకాంగ్‌ సీఈవో కెరీ లామ్‌ ప్రకటించారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని