Monkey B Virus: చైనాలో తొలి మరణం!

కొవిడ్‌-19కు పుట్టినిళ్లుగా భావిస్తోన్న చైనాలో.. తాజాగా మరో వైరస్‌ కలకలం రేపుతోంది. కోతుల నుంచి సంక్రమించే ‘మంకీ బీ (Monkey B)’ మానవుల్లో తొలి కేసు నిర్ధారణ అయినట్లు చైనా వెల్లడించింది.

Published : 19 Jul 2021 01:09 IST

చైనా సీడీసీ వెల్లడి

బీజింగ్‌: కొవిడ్‌-19కు పుట్టినిళ్లుగా భావిస్తున్న చైనాలో తాజాగా మరో వైరస్‌ కలకలం రేపుతోంది. కోతుల నుంచి సంక్రమించే ‘మంకీ బీ (Monkey B)’ మానవుల్లో తొలి కేసు నిర్ధారణ అయినట్లు చైనా వెల్లడించింది. ఈ వైరస్‌ సోకిన తొలి వ్యక్తి కూడా ఇతనేనని.. ఈ మధ్యే అతడు మరణించినట్లు ప్రకటించింది. అయితే, అతని సన్నిహితులకు మాత్రం ఎలాంటి లక్షణాలు లేవని.. వారందరూ సురక్షితంగానే ఉన్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది.

బీజింగ్‌కు చెందిన ఓ పశువైద్యుడు (57) జంతువులపై పరిశోధనలు జరుపుతున్నాడు. పరిశోధనలో భాగంగా మార్చి నెలలో రెండు చనిపోయిన కోతుల శరీరాలను ముక్కలుగా చేసి పరీక్షించాడు. అనంతరం ఆ పశువైద్యుడు అనారోగ్యానికి గురయ్యాడు. తొలుత వాంతి, వికారం వంటి లక్షణాలు కనిపించడంతో అతడు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ప్రయత్నించాడు. కొన్ని రోజులకు అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు మే 27న ప్రాణాలు కోల్పోయినట్లు చైనా అధికారులు వెల్లడించారు. అనంతరం అతడి నమూనాలను పరీక్షించగా మంకీ బీ వైరస్‌ (Monkey B Virus) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. చైనాలో ‘మంకీ బీ’ సోకి ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి ఇతనేనని చైనీస్‌ సీడీసీ (సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌-CDC) ప్రకటించింది. చైనాలో ఇంతకుముందు ఎన్నడూ ఈ వైరస్‌ సోకిన దాఖలాలు లేవని.. ఇదే తొలి కేసు అని వెల్లడించింది.

80శాతం మరణాల రేటు..

బీవీ గా పిలిచే మంకీ బీ వైరస్‌ (BV)ను తొలిసారి మకాక్స్‌ అనే కోతి జాతిలో 1932లోనే గుర్తించారు. ఇది కోతుల నుంచి నేరుగా, శరీర ద్రవాల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ సోకితే మరణాల రేటు 70 శాతం నుంచి 80 శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోతుల సంరక్షణ చూసే వ్యక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని చైనా అధికారులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని