Bollywood: కరోనా కష్టం.. బాలీవుడ్‌కు నష్టం

కరోనా చిత్రసీమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తొలి, రెండో వేవ్‌ల్లో దాని విజృంభణకు భారీ నష్టాల్ని మూటగట్టుకుంది బాలీవుడ్‌ చిత్రసీమ. అయిందేదో అయిపోయింది ఈ ఏడాది బాగుంటుందన్న ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినా నిరాశే ఎదురైంది.

Updated : 23 Jan 2022 07:05 IST

తొలి మూడు నెలల్లో రూ.1500కోట్లు

విడుదల వాయిదాలు... ఆగిన చిత్రీకరణలు

కరోనా చిత్రసీమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తొలి, రెండో వేవ్‌ల్లో దాని విజృంభణకు భారీ నష్టాల్ని మూటగట్టుకుంది బాలీవుడ్‌ చిత్రసీమ. అయిందేదో అయిపోయింది ఈ ఏడాది బాగుంటుందన్న ఆశతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టినా నిరాశే ఎదురైంది. మూడో వేవ్‌ దెబ్బకు మళ్లీ కథ మొదటికొచ్చింది. విడుదలలు వాయిదా వేయాల్సి వచ్చింది. షూటింగులు ఆగిపోయాయి. చాలా చోట్ల థియేటర్లు నడవడం లేదు. నడిచే చోట 50 ఆక్యుపెన్సీ. దీంతో పలు పాన్‌ ఇండియా స్థాయి సినిమాలతో పాటు భారీ బాలీవుడ్‌ చిత్రాల విడుదలా ఆగిపోయింది. దీంతో బాలీవుడ్‌కు తీవ్ర నష్టం తప్పట్లేదు.

కరోనా మూడోవేవ్‌ కారణంగా సినిమా విడుదలల వాయిదా, చిత్రీకరణ షెడ్యూల్స్‌ అన్నీ మారిపోవడంతో బాలీవుడ్‌ ఓ విధంగా స్తంభించిపోయింది. ‘జెర్సీ’ సినిమా వాయిదాతో కరోనా ప్రభావం చిత్రసీమ మీద మొదలైంది. షాహిద్‌కపూర్‌ కథానాయకుడిగా గౌతమ్‌తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇలా మొదలైన వాయిదాల పర్వం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రెట్టింపైంది. సినీవర్గాల్లో ఆందోళనా పెరిగిపోయింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో క్రేజీ చిత్రంగా మారింది. ఆ తర్వాత ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, అక్షయ్‌కుమార్‌ ‘పృథ్వీరాజ్‌’ వాయిదా పడటంతో బాలీవుడ్‌లో సందడే పోయింది. మార్చి వరకూ ఈ పరిస్థితి. అదే జరిగితే తక్కువలో తక్కువ రూ.1000కోట్లు పైగానే నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ‘‘2019 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి బాక్సాఫీసు లెక్కలు మారాయి. సంవత్సర లెక్కలు కాకుండా మూడు నెలల చొప్పున అంచనా వేస్తున్నాం. అలా చూసుకుంటే ఈ ఏడాది తొలి త్రైమాసికం దెబ్బతిన్నట్టే. దీని వల్ల చిత్ర నిర్మాణ రంగమే కాదు డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థ దెబ్బతింది’’అంటున్నారు  రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో శిభాషిస్‌ సర్కార్‌.

పండగను కోల్పోయాం

కీలకమైన పండగ సీజన్‌ బాలీవుడ్‌ని బాగా దెబ్బకొట్టిందనే ఆవేదన పరిశ్రమలో వ్యక్తం అవుతోంది. ‘‘బాక్సాఫీసు లెక్కల ప్రకారం చూస్తే ఈ ఏడాది తొలి త్రైమాసిక నష్టం రూ.1500కోట్లు. ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన పండగ సీజన్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఫిబ్రవరి, మార్చిల్లో పరిస్థితులు అనుకూలించేలా లేవు. దాంతో ఏప్రిల్‌ నుంచి పరిస్థితి గాడిన పడుతుందనే ఆశతో ఉన్నాం’’అంటున్నారు ట్రేడ్‌ విశ్లేషకుడు జోగిందర్‌.


చిత్రీకరణలు ఆగిపోయినా నష్టమే

భారీ చిత్రాల షూటింగులు నిలిచిపోవడమూ తీవ్ర నష్టమే అంటున్నారు నిర్మాతలు. ‘‘పెద్ద చిత్రాల నుంచి ఓ మాదిరి బడ్జెట్‌ చిత్రాల వరకూ షెడ్యూల్‌ ప్రకారం ముందస్తుగా చాలా సన్నాహాలు జరుగుతాయి. దాని కోసం రూ.కోట్లలో వ్యయం అవుతుంది. అవుట్‌డోర్‌ షెడ్యూల్స్‌ అంటే మరింత ఖర్చు ఉంటుంది. కరోనా తీవ్రత పెరగడంతో షూటింగులు ఆగిపోతున్నాయి. దీంతో చేసిన వ్యయంలో చాలావరకూ వృథా అయిపోతుంది. మళ్లీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేయాలంటే బడ్జెట్‌ పెరిగిపోతుంది. అంతే కాకుండా అనుకున్న సమయానికి విడుదల చేయలేని పరిస్థితి. సర్దుకుపోయి ఏదో ఒక తేదీకి విడుదల చేస్తే ఆశించిన వసూళ్లు రావు’’అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏప్రిల్‌ వరకూ థియేటర్‌ల పరిస్థితులు మారేలా కనిపించడం లేదు. మార్చి తొలివారం తర్వాత ఆశాజనకంగా మారి భారీ చిత్రాలు విడుదల మొదలై, చిత్రీకరణలైనా అనుకున్న ప్రకారం జరిగితే కొంతమేర నష్టాల నుంచి గట్టెక్కొచ్చు అంటున్నాయి సినీ వ్యాపార వర్గాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని