Friendship Day: ఓ వైపు హాస్యం.. మరోవైపు భావోద్వేగం

ప్రేక్షకులకి వినోదం పంచే కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా ఒకటి’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘స్నేహమేరా జీవితం’ పేరుతో ప్రత్యేక ఎపిసోడ్‌ని రూపొందించారు.

Published : 26 Jul 2021 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులకి మాంచి వినోదం పంచే కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా ఒకటి’. సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘స్నేహమేరా జీవితం’ పేరుతో ప్రత్యేక ఎపిసోడ్‌ రూపొందింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై, నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేస్తోంది. ఆ వివరాలివీ.. సినీ నటులు ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, కొందరు సీరియల్‌ తారలు ఈ షోలో మెరిశారు. తమ తమ స్నేహితుల గురించి మాట్లాడారు. అనంతరం సుధీర్‌- ప్రియదర్శి, అభినవ్‌ గోమటం- ప్రసాద్‌ మధ్య పంచ్‌ల యుద్ధం మొదలైంది. ప్రియదర్శి ఇచ్చిన కౌంటర్‌కి సుధీర్‌, ప్రసాద్‌ ఇచ్చిన కౌంటర్‌కి అభినవ్‌ అయోమయంలో పడిపోయి, హావభావాలతో కామెడీ పండించారు. సుధీర్‌, గెటప్‌ శ్రీను, రామ్‌ ప్రసాద్‌ ఆలపించిన ‘ఓ మై ఫ్రెండ్‌’ గీతం అలరిస్తుంది. నూకరాజు తమ్ముడు, ప్రసాద్‌ స్నేహితుడి మాటలు మెప్పించాయి. మధ్యలో ఇద్దరు స్నేహితులు దిగిన ఓ ఫొటో గురించి వ్యాఖ్యానిస్తూ ఆది, సుధీర్‌, ప్రసాద్‌ గిలిగింతలు పెట్టారు.

ఇలా సరదాగా సాగే వీడియోలో భావోద్వేగ సన్నివేశం ప్రత్యక్షమై అందరి హృదయాల్ని హత్తుకుంటుంది. స్నేహం విలువేంటో నూకరాజు, ఇమ్మాన్యుయేల్‌ తమ స్కిట్‌ ద్వారా తెలియజేసే దృశ్యమిది. కళ్లు లేని వ్యక్తిగా నూకరాజు, అతనికి కళ్లు దానం చేసే స్నేహితుడిగా ఇమ్మాన్యుయేల్ పాత్రలు ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తున్నాయి. దీన్ని చూసి చలించిన ప్రియదర్శి ‘నూకరాజు, ఇమ్మాన్యుయేల్‌.. సమయం దొరికితే దయచేసి సినిమాల్లో ప్రయత్నించండి’ అని తన మనసులో మాట తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూస్తూ మీరూ మీ స్నేహితుల్ని గుర్తు చేసుకోండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని