Sidhu: ‘రాజీనామా వెనక్కి తీసుకున్నా, కానీ’.. కాంగ్రెస్‌కు సిద్ధూ అల్టిమేటం!

పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వెల్లడించారు. శుక్రవారం ఆయన చండీగఢ్‌లో......

Published : 06 Nov 2021 02:03 IST

చండీగఢ్‌: పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు కాంగ్రెస్‌ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వెల్లడించారు. శుక్రవారం ఆయన చండీగఢ్‌లో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ఓ అల్టిమేటం జారీచేశారు. పంజాబ్‌కు కొత్త అడ్వకేట్‌ జనరల్‌ని నియమించిన రోజే తాను కాంగ్రెస్‌ కార్యాలయంలో అడుగు పెట్టి.. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని తేల్చి చెప్పారు.

తన రాజీనామా నిర్ణయం వ్యక్తిగత ఇగోతో తీసుకున్నది కాదని, పంజాబీల ప్రయోజనాల కోసమే అలా చేసినట్టు సిద్ధూ వివరించారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీతో తనకు ఎలాంటి విభేదాల్లేవని స్పష్టంచేశారు. తానేం చేసినా పంజాబ్‌ రాష్ట్రం కోసమే చేస్తానని, పంజాబ్‌ తన ఆత్మ అన్నారు. గత నాలుగున్నరేళ్లుగా మద్యం, బస్సులు సహా అనేక అంశాలను లేవనెత్తానన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్‌ సింగ్‌ అధికారులను తన చేతుల్లో పెట్టుకొని పనిచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పదవిపై తనకు ఎలాంటి ఆశా లేదని, పంజాబీల హక్కుల కోసం మాత్రమే తాను పోరాడతానన్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో 80 నుంచి 100 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. 

ప్రస్తుతం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సీనియర్ న్యాయవాది ఏపీఎస్‌ డియోల్‌ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2015లో అప్పటి అకాలీదళ్‌ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై కాల్పులు, మతపరమైన ఘటనలకు సంబంధించిన కేసుల్లో నిందితులైన మాజీ డీజీపీ సుమేధ్‌ సైనీ, మరో పోలీసు అధికారి తరఫున వాదించిన డియోల్‌ని ఏజీగా నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ప్రస్తుతం డీజీపీగా ఉన్న సహోతాను కూడా తప్పించాలని సిద్ధూ డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన అప్పట్లో ప్రభుత్వం నియమించిన సిట్‌కు నేతృత్వం వహించారని పేర్కొన్నారు. అయితే, తనపై సిద్ధూ విమర్శల నేపథ్యంలో డియోల్‌ తన ఏజీ పదవికి రాజీనామా చేస్తూ సీఎంకు సోమవారం లేఖ అందించగా.. దానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఏజీ రాజీనామాను సీఎం చరణ్‌జిత్‌ చన్నీ తిరస్కరించినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని