IPL 2021: ధోనీ ఒక్కడే నెమ్మదిగా ఆడలేదు: ఫ్లెమింగ్

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఒక్కడే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడలేదని, దిల్లీ బ్యాట్స్‌మెన్‌ కూడా ధాటిగా ఆడలేకపోయారని...

Published : 06 Oct 2021 01:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఒక్కడే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడలేదని.. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ కూడా ధాటిగా ఆడలేకపోయారని ఆ జట్టు హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అన్నాడు. సోమవారం రాత్రి తలపడిన మ్యాచ్‌లో మహీ 27 బంతులాడి 18 పరుగులే చేశాడు. ఐపీఎల్‌లో 25 కన్నా ఎక్కువ బంతులు ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఇదే అతి నెమ్మదిగా సాగింది. ఇందులో ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడు. దీంతో ధోనీ బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫ్లెమింగ్‌ స్పందించాడు.

‘ఈ మ్యాచ్‌లో ధోనీ ఒక్కడే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడలేదు. ఈ పిచ్‌పై స్ట్రోక్‌ప్లే ఆడటం చాలా కష్టం. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ సైతం పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. అందుకే మ్యాచ్‌ను చివరి వరకూ (19.4 ఓవర్లు) తీసుకెళ్లారు. దీన్నిబట్టి ఇరు జట్లూ ఇక్కడ పరుగులు చేసేందుకు కష్టపడ్డాయని అర్థమవుతోంది. కొన్నిసార్లు అంచనాలు భారీగా ఉంటాయి. బాగా ఆడాలని కోరుకుంటారు. కానీ, మేం ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు 10-15 పరుగులే తక్కువ సాధించాం’ అని ఫ్లెమింగ్‌ వివరించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 136/5 స్కోర్‌ సాధించగా.. ఛేదనలో దిల్లీ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లు ఓటమిపాలైన చెన్నై 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని