CM KCR: యాసంగిలో కొనలేం
కేంద్రం చేతులెత్తేసి.. ధాన్యం తీసుకోవడానికి నిరాకరించినందున యాసంగిలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండబోవని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు వరి వేసి ఆగం కావద్దని స్పష్టం చేశారు. వారికి రైతుబంధు మాత్రం....
కేంద్రం ధాన్యం తీసుకోనని తేల్చిచెప్పింది..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుండవు
కేంద్రంలో ఉన్నది రైతు హంతక, రాబందు ప్రభుత్వం
750 మందిని పొట్టన పెట్టుకుంది
వరి వేసి రైతులు ఆగం కావద్దు
కిషన్రెడ్డి దద్దమ్మలా మాట్లాడారు
ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు - హైదరాబాద్
రైతుల ఉసురు పోసుకోవడానికి కేంద్రం కరెంటు చట్టం తెచ్చింది. బోర్లకు మీటర్లు పెట్టాలంటోంది. రైతు మెడపై కత్తి పెడతానంటోంది. లేకుంటే రాష్ట్రానికి వచ్చే హక్కులు, అధికారాలు కట్ చేస్తదట. కేంద్రమే విద్యుత్ మీద పెత్తనం చేస్తదట. అప్పుడు 24 గంటల కరెంటు వద్దంటరు. అందరిలాగానే 16 గంటలే ఇస్తమంటరు.. ఇది మనకు కుదురుతాదా? రైతులు, సామాన్యులకు రక్షణ ఉండాలంటే భాజపా ప్రభుత్వం పోవాలి
రైతుల తరఫున మంత్రులు, ఎంపీలు, సీఎస్ దిల్లీ వెళ్తే ‘మీకు వేరే పనిలేదా?’ అని కేంద్రమంత్రి (పీయూష్ గోయల్) అన్నారు. మంత్రులకు పనిలేక వెళ్తారా? ఇలాగేనా ఒక కేంద్రమంత్రి మాట్లాడేది? రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారా? తెలంగాణ రైతులను ముంచడానికే కేంద్రం చూస్తోంది. రేపు రైతు పంట పండిస్తాడు.. వీళ్లు తీసుకోరు.. అప్పుడు ఏం చేయాలి.
దేశాన్ని రావణకాష్టం చేయాలని చూస్తున్నది కేంద్రం. ప్రపంచ ఆకలి సూచీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ల కంటే వెనకపడ్డాం. దేశంలో అప్పులు పెంచింది భాజపా. రూ. 80 లక్షల కోట్ల అప్పులు చేసింది. పాత అప్పులు రూ. 50 లక్షల కోట్లు ఉన్నాయి.
- ముఖ్యమంత్రి కేసీఆర్
కేంద్రం చేతులెత్తేసి.. ధాన్యం తీసుకోవడానికి నిరాకరించినందున యాసంగిలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండబోవని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు వరి వేసి ఆగం కావద్దని స్పష్టం చేశారు. వారికి రైతుబంధు మాత్రం కొనసాగుతుందని చెప్పారు. వానాకాలం పంట ఎంతైనా కొంటామని, కేంద్రం తీసుకోకుంటే ఆ పంటను ప్రధాని, కిషన్రెడ్డి ఇళ్ల ముందు, భాజపా కార్యాలయాలు, ఇండియా గేట్ వద్ద పోస్తామన్నారు. కేంద్రంలో దుర్మార్గపు, రైతు వ్యతిరేక, హంతక, రాబందు ప్రభుత్వం ఉందని, 750 మంది రైతులను పొట్టన పెట్టుకొని, పూర్తిగా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఇంత దిగజారిన, నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని.. భవిష్యత్తులో చూస్తామని కూడా అనుకోవడం లేదన్నారు. ధాన్యాన్ని సేకరించబోమంటూ కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరించిందని.. రైతాంగాన్ని గందరగోళపరుస్తోందని విరుచుకుపడ్డారు. దేశంలో రైతులు బాగుపడాలంటే భాజపాను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ధాన్యం కొనాలని ఒప్పించే ధైర్యం లేక ఇక్కడ అసత్యాలు చెబుతూ చేతగాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో బహిరంగ చర్చకు రావాలన్నారు. సోమవారం మంత్రిమండలి సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ప్రజలు ఆహారం లేక చస్తుంటే.. నిల్వలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. నిజంగా నిల్వలు అధికంగా ఉంటే ప్రజలకు వాటిని ఉచితంగా పంపిణీ చేయాలి’ అని సూచించారు.
దిక్కుమాలిన మాటలు
‘‘దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం.. సేకరించిన వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం.. దేశ ఆహార భద్రత కేంద్రం బాధ్యత. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. కానీ.. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. రైతుల ప్రయోజనాలను, వ్యవసాయాన్ని కేంద్రం ఆగం చేస్తోంది. ఇది మంచి చేసే ప్రభుత్వం కాదు. ముంచే ప్రభుత్వం. తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనబోమని చెప్పడం దుర్మార్గం. ఇది రైతు వ్యతిరేక పార్టీ. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో భాజపా కన్నా తెలంగాణ ప్రభుత్వం కోటి రెట్లు మెరుగు. ఎన్నో రైతు సంక్షేమ విధానాలు అమలు చేస్తున్నాం. మా చేతుల్లో ఎన్ని ఉన్నాయో అన్నీ రైతులకు అందజేస్తం. తెలంగాణ రైతు బీమా పథకం మరెక్కడా లేదు. తెలంగాణ రాష్ట్రం అత్యధిక పంట పండిస్తున్నందున కేంద్రం ఓర్వడం లేదు. ధాన్యం కొంటారా.. కొనరా.. అంటే అది చెప్పకుండా భాజపా వాళ్లు ఏమేమో చెబుతున్నారు. మేం వడ్లు కొనం.. అయినా కల్లాల కాడ కొట్లాడుతాం అంటరు.. పనికిమాలిన చట్టాలు చేసేది. వాపసు తీసుకునేది భాజపాయే. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడతారు. భాజపా వాళ్లకు పాలించడం చేతకాదు. మీ చేతగానితనాన్ని రాష్ట్రంపై రుద్దుతారా? మేం భాజపాలాగా చిల్లర రాజకీయాలు చేయడంలేదు. తెలంగాణలో యాసంగిలో వాతావరణం వల్ల ఉప్పుడు బియ్యమే వస్తాయి. మామూలుగా వర్షాకాలంలో పండే బియ్యం 67 కిలోలు వస్తే.. యాసంగిలో పండే పంటకు బియ్యం 35 కిలోలే వస్తది. ఆ నష్టం ఎవరు భరించాలి? బాయిల్ చేసి అమ్మితే కరెక్ట్గా వస్తుంది. అందుకే పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వచ్చాయి. గత సంవత్సరం దాకా తీసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఒక గింజ కూడా తీసుకోం అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారు. ఇప్పుడు రైతులు ఏం చేయాలి? కేంద్రం చేతులెత్తేసింది.. గత యాసంగి ధాన్యమే పూర్తిగా తీసుకోలేదు. అప్పుడు రాష్ట్రం సేకరించిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పంటలసాగుపై సరైన నిర్ణయం తీసుకోవాలి. సొంత వినియోగానికి, విత్తన కంపెనీలతో ఒప్పందం ఏదైనా ఉంటే వరి సాగు చేసుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరి కొనుగోలు చేయదు.
ఉన్మాదిలా మాట్లాడుతున్న కిషన్రెడ్డి
కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉప్పుడు బియ్యం కొంటారా? కొనరా? చెప్పమంటే చెప్పరట. వర్షాకాలం ఎంత తీసుకుంటారో చెప్పమంటే చెప్పరట. ఈ ఉల్టాపల్టా మాట్లాడి మేం బియ్యం కొనమన్నమా? అని అంటున్నారు. చాతకాని దద్దమ్మ. అయామ్ వెరీ సారీ. ఆయన ఏం మాట్లాడుతున్నరు. ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నరు. మీకు దమ్ముంటే తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొనిపించాలి. తెలంగాణలో ఉప్పుడు బియ్యమే వస్తాయి. 35 డిగ్రీల్లో ఎండల్లో పండుతాది మా పంట.. మీ చేతగానితనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చారు. మీ ప్రధానే క్షమాపణలు చెప్పారు రైతాంగానికి. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న హంతకుల పార్టీ మీది.. మీరు మాట్లాడతారా? మీది రైతు రాబందుల పార్టీ.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. పక్కన మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు
మేం రైతుబంధువులం
మేం రైతుబంధువులం. కొత్త రాష్ట్రమైనా.. కేంద్రం సహకరించనప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. ఏపీ ఇబ్బంది పెట్టినా, కొందరు కేసులు వేసినా ప్రాజెక్టులు నిర్మించాం. ప్రభుత్వ కృషి వల్లే తెలంగాణలో పంటల దిగుబడి పెరిగిందని చెప్పారు. గతంలో తెలంగాణ నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మాత్రమే జరిగింది. మా హయాంలో 69.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతోంది. నాశనమైన చెరువులను బాగు చేశాం. ప్రాజెక్టులు కట్టాం. ఆయకట్టు స్థిరీకరణ చేశాం. పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేశాం. ఇవన్నీ కనపడలేదా? ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టు, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్సాగర్, దేవాదుల ఎవరు పూర్తి చేశారో అందరికీ తెలుసు. ఏడేళ్ల క్రితం మూడెకరాల రైతు పరిస్థితి ఏమిటి. ఈరోజు ఏమిటి? రాష్ట్రం వస్తే ధరలు పడిపోతాయి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు 20 లక్షల్లోపు భూములే దొరకడంలేదు. రోడ్డు ఉంటే ఎకరా రూ. 30, 40 50 లక్షలు, జాతీయ రహదారి వెంట రూ.3 కోట్ల ధర పలుకుతున్నాయి. అయిదెకరాలున్న తెలంగాణ రైతు కోటీశ్వరుడు.. ఏడేళ్ల క్రితం బిచ్చగాడు.. ఇప్పుడు తెలంగాణ రైతులు కాలర్ ఎగరేసి ప్రకాశం, కర్ణాటకలో భూములు కొంటున్నారు.
విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తాం
విద్యుత్ బిల్లుపై రైతాంగానికి ముప్పు ఉంది. బోర్ల వద్ద మీటర్లు పెట్టాలంటున్నారు. లేకపోతే నిధులివ్వబోమంటున్నారు. విద్యుత్పై పెత్తనం వస్తే ఉచిత విద్యుత్ను తీసేయమంటారు. ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తాం. మేం ఎస్సీ వర్గీకరణ బిల్లు పంపితే పెండింగ్లో పెట్టారు. యూపీ ఎన్నికల కోసం దళిత్ అంటున్నారు. గిరిజన, ముస్లిం రిజర్వేషన్లను పెంచాలన్నా వినడం లేదు. వీటన్నింటిపై పార్లమెంటులో అడుగడుక్కీ కేంద్రాన్ని నిలదీస్తాం.
రైతులకు రూ. 27.50 కోట్ల సాయం
రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు ఇస్తామన్నా.. రూ. 27.50 కోట్ల ఆర్థికసాయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. నేను, మంత్రులు వెళ్లి రైతు కుటుంబాలకు అందజేస్తాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
దేశానికి ఏం ఒరగబెట్టారు?
ఏడేళ్లలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. బీసీలు, దళితులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఏం చేశారు? ఈ దేశానికి ఒరగబెట్టింది ఏమిటి? వీళ్లను నమ్మితే సర్వనాశనం అయిపోతారు. దేశంలో పెట్రో ధరలు పెంచిందెవరు? నరేంద్రమోదీ ప్రభుత్వం కాదా? క్రూడాయిల్ ధర అప్పుడెంత? ఇప్పుడెంత? ధర తగ్గినా అబద్ధాలు చెప్పి, దేశాన్ని మోసం చేసి డీజిల్ ధరలు పెంచుతున్నారు. పెంచిన తదుపరి రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని ధర్నాలు చేస్తారా? ఏమైనా సిగ్గుందా? ప్రజలు అమాయకులా? మీరేమో పెంచాలే.. మేం తగ్గియ్యాల్నా? ఇది నీతా? దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం చేసే గొప్పతనమా ఇది.. ఇదేం దందా. కచ్చితంగా వీరు ముంచేటోళ్లు తప్ప మంచి చేసేటోళ్లు కాదని తేలిపోయింది. మతపిచ్చితో విభజన రాజకీయాలు.. దేశాన్ని రావణకాష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఐటీ, పరిశ్రమలు వస్తున్నాయి. ఆర్థికంగా బలంగా తయారవుతోంది. ఇండియాటుడే రేటింగ్లో నంబర్ 1గా నిలిచింది.. మతాల మధ్య పంచాయితీ, మతకల్లోలాలు పెట్టి, కర్ఫ్యూ ఫైరింగ్లు పెడితే మంచిదా? భాజపాది అదే ధోరణి, దానిని ప్రజలు అంగీకరిస్తారా? విభజన పార్టీయా దేశానికి కావాల్సింది?
- ముఖ్యమంత్రి కేసీఆర్
సాగులో ఇంత సాధించాం
* తెలంగాణలో 2004 నుంచి 2013-14 వరకు సగటున వరి ధాన్యం సేకరణ 10.09 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా సగటున 69.38 లక్షల టన్నుల సేకరణ జరిగింది. 2020-21 సీజన్లో 141.08 లక్షల టన్నులను సేకరించాం.
* తెలంగాణలో 2004 నుంచి 2013-14 వరకు సగటున 37.47 లక్షల ఎకరాల్లో ధాన్యం సాగయింది. రాష్ట్రం వచ్చాక గత ఏడేళ్ల కాలంలో సగటున 55.28 లక్షల ఎకరాల్లో వరి పండింది. 2020-21లో అత్యధికంగా 104.23 లక్షల ఎకరాల్లో వరి సాగయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు